Tuesday, March 17, 2009

ఖలీల్ జిబ్రాన్ ’ది ప్రాఫెట్’ కి కాళోజిగారి అనువాదం

కాళోజిగారు ఖలీల్ జిబ్రాన్ ’ది ప్రాఫెట్’ని తెలుగులోకి ’జీవన గీత’ పేరుతో అనువదించారు. దీనిని యువభారతి వారు అప్పట్లో ప్రచురించారు. ఆ తరువాత కూడా దీనిని కొంత మంది అనువదించారు. నేను అనువదించినది హెచ్ బి టి ’జీవన గీతం’ గా ప్రచురించింది.

కాళోజిగారి అనువాదాన్ని ఇక్కడ చూడవచ్చు:

http://openlibrary.org/b/OL23135178M/జీవన-గీత

’ది ప్రాఫెట్’కి నా అనువాదంనుంచి ఒక భాగం:

మీ పిల్లలు మీ పిల్లలు కారు.
తనను తాను కోరుకునే జీవితపు కొడుకులూ, కూతుళ్ళూ వారు.
వారు మీ ద్వారానే వస్తారు కాని మీ నుంచి కాదు.
మీతో ఉన్నప్పటికీ వాళ్ళు మీకు చెందరు.


వారికి ప్రేమను ఇవ్వవచ్చు, కాని మీ ఆలోచనలను ఇవ్వవద్దు:
వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి ఉంటాయి.

వాళ్ళ శరీరాలకు ఆశ్రయం ఇవ్వవచ్చు కాని వాళ్ళ ఆత్మలకు కాదు:
మీ కలల్లో సైతం చూడలేని రేపటి ఇళ్ళల్లో వాళ్ళ ఆత్మలు ఉంటాయి.

వారిలాగే మీరు ఉండటానికి మీరు ప్రయత్నించవచ్చు, కాని మీలాగా వారిని చెయ్యటానికి పూనుకోవద్దు:
జీవితం వెనక్కి నడవదు, నిన్నటితో కాలయాపన చెయ్యదు.


మీ పిల్లలు సజీవులైన బాణాల మాదిరి విడవబడేందుకు ఉపయోగపడే విల్లు మీరు.

అనంతపథంలోకి గురి చూసి బాణాలు వేగంగా, దూరానికి చేరుకునేలా తన శక్తినంతటితో విలుకాడు విల్లుని వంచినట్లు మిమ్మల్ని వంచుతాడు.

విలుకాడు చేతిలో మీరు వంచబడటం సంతోషంకోసమే కానివ్వండి;

దూసుకుపోతున్న బాణాన్ని ప్రేమించినట్లే చేతిలో స్థిరంగా ఉన్న విల్లునీ అతడు ప్రేమిస్తాడు.

Monday, February 16, 2009

పిల్లలు ఆసక్తి గొలుపుతారు...

’పిల్లలకు పుస్తకాలు పరిచయం చేయండి’ అంటూ ఇంతకు ముందు రాశాను. అదే విషయాన్ని మా శ్రీకాంత్ మేనకోడలు ’అశ్రిత’ (18 నెలలు) చూబిస్తోంది.

ఈ వీడియో ఉన్న లింకు: http://www.youtube.com/watch?v=P-w_KBUiPy8

కొన్ని వేలవేల మంది ఇదే ప్రక్రియలలోంచి ఎదిగి ఉంటారు. కాని ఆ అనుభవాన్ని తొలిసారి పొందిన వారికి, చూసినవారికి అది ఒక నూతన ఆవిష్కారం, పరమానందభరిత ద్రుశ్యం. జీవితంలోని మహత్యం, మాధుర్యాలు ఇవే.

'How Children Learn' అన్న పుస్తకానికి జాన్ హోల్ట్ రాసిన ముందుమాట లోంచి ఈ నాలుగు మాటలతో దీనిని ముగిస్తాను:
’తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశోధించి, దానిని అర్ధం చేసుకోటానికి శిశివులు, పిల్లలు చేసే ప్రయత్నాలను గమనించటంకంటే ఈ ప్రపంచంలో అద్భుతమైనది మరొకటి లేదు. అనేక ప్రదేశాలలో, అనేక సందర్భాలలో పిల్లల్ని నేను గమనించాను. పెద్దవాళ్ళు ఎంతోమంది చెప్పినవాటికంటే, చేసినవాటికంటే పిల్లల మాటలు, చేష్టలు నాకు ఎంతో ఆనందాన్ని, తీవ్ర ఆలోచనలకు ప్రేరణనీ ఇచ్చాయి. చిన్న పిల్లలంటే ఇష్టంలేకపోవటం, వాళ్ళు ఆసక్తికరంగా అనిపించకపోవటం, వాళ్ళ సాంగత్యాన్ని ఆనందించలేకపోవటం నేరం ఏమీకాదు. కాని అలా కానప్పుడు జీవితంలో ఎంతో కోల్పోతాం అనిమాత్రం చెప్పగలను.’


Monday, January 19, 2009

మంచి పుస్తకం ప్రచురించిన కొన్ని పుస్తకాల వివరాలు

తెలుగు-ఇంగ్లీషు (బైలింగ్వల్ పుస్తకాలు)

సుతయేవ్ పుస్తకాల జాబితా   (12 పుస్తకాలు) వెల 191/-

+      సెట్ - 1

*  ఎలకకు దొరికిన పెన్సిలు            12/-

*  పడవ ప్రయాణం                       12/-

*  మూడు పిల్లి పిల్లలు                  12/-

*  నేను కూడా                            15/-

+     సెట్ - 2

*  భలే బాతు                              22/-

*  ఎవరు మ్యావ్ అన్నారు?           22/-

*  పుట్తగొదుగు కింద                    18/-

*   రకరకాల బండి చక్రాలు             18/-

+   సెట్ - 3

*  కోపదారి పిల్లి                            12/-

*  రంగురంగుల కోడిపుంజు            12/-

*  ఆపిల్ పండు                           16/-

*  మాయలమారి కర్ర                    20/-

+  ఈసోపు కథలు : 4 పుస్తకాలు   135/-

*   రాద్లోవ్ బొమ్మల కథలు             75/-

 

+  జీవిత కథలు (4 పుస్తకలు)    40/-

*   లూయీ బ్రేల్

*   మేరీ క్యూరీ

*   జార్జి వాషింగ్తన్ కార్వర్

*   చేయూతనిచ్చే చేతులు

+  పిల్లల కథలు

*   బాలల కథలు                         20/-

*   నక్క- కుందేలు                       30/-

*   బుల్లి మట్టి ఇల్లు                      120/-

*   అనగా అనగా కథలు                40/-

*   వింత ద్రుశ్యం                           40/-

 

ఎలీనా వాట్స్ రచించిన అజంతా అపా ర్ట్మెంట్స్

     ఎలీనా వాట్స్ లండన్ లో పుట్టారు. ఈమె తండ్రి హైదరాబాద్ లో పనిచేశారు.అందువల్ల ఈమె బాల్యం లో కొన్ని సంవత్స రాలు ఇక్కడ గడిచాయి. హైదరాబాద్ తో సంబంధాన్ని ఆమె వదులుకోలేదు.మదనపల్లె దగ్గరలో డేవిడ్ హార్స్ బరో ప్రారంభించిన "నీల్ బాగ్" స్కూల్లో పనిచేసారు. తరువాత నెల్లూరు జిల్లాలోని పల్లిపాడు లో "సృజన" స్కూల్ ను శివరామ్ తో కలసి నడిపారు.అక్కడ చాలా కాలం ఉన్నారు.

తరవాత ఈమె హైదరాబాద్ లో నివశించారు. ఓరియంట్ బ్లాక్ స్వాన్ కోసం అనేక పుస్తకాలు రాశారు. తనచుట్టు పక్కల వారిని, తన కొడుకు మైకీ,అతని స్నేహితుల్ని పాత్రలుగా మలచి కథల్ని రాశారు. పిల్లలు ఇప్పుడు పెద్దలై ఉద్యోగాలు చేస్తున్నారు. పుస్తకాల ఆవిష్కరణకు ఆమెతో పాటు అప్పటి పిల్లలు (ఇప్పటి పెద్దలు) కొందరు వచ్చారు.

గత కొన్ని సంవత్సరాలుగా ఈమె లండన్ లో ఉంటున్నారు. ఏడాది, రెండేళ్ళకు ఈమె ఇక్కడకు వస్తూనే ఉంటారు.

 (8 పుస్తకాల సెట్)(ఒక్కొక్కటి 18/-)    144/-

సెట్ లోని పుస్తకాలు:

*   అల్లరి జ్యోతి

*   పాత కుందేలు

*   జ్యోతి, పక్కింటి మనిషి

*   పుట్టిన రోజు బొమ్మ

*   మంచి మిత్రులు

*   హస్మినా గాలిపటం

*   మదన్, సయీఫ్

*   గణేష్, సయీఫ్  వేటకు  వెళ్ళారు

Tuesday, January 13, 2009

అనగా అనగా కథలు

సాంప్రదాయం అనే ఎడారిలో హేతువు ఇంకిపోతే మిగిలేది తంతుమాత్రమే. కాని జానపద సాహిత్యం, కళలు అనేవి కాలం పరీక్షకు నిలిచి, నిగ్గుతేలిన నికార్సయిన సంపద. ప్రత్యేకించి బాల సాహిత్యంలో జానపద కథలని చెప్పుకునే ఫోక్ టేల్స్ ఎంతో విలువైనవి. ఇవి సార్వజనీనమైనవి, అన్ని కాలాల పిల్లలను అలరించేవి.

అద్భుత ఊహా ప్రపంచంలోకి జానపద కథలు పిల్లల్ని తీసుకెళతాయి. భయంకొలిపే రాక్షసులు, మాట్లాడే పశుపక్ష్యాదులు, సొరంగ మార్గాలు, ఒంటి స్తంభం మేడలు, మాయలు మంత్రాలు ఈ కథల్లో కనిపిస్తాయి. అంతేకాదు వీటిల్లో అసూయద్వేషాలు, కుట్రలు కుతంత్రాలు, మంచి చెడులు, ధైర్యసాహసాలు వంటివి ఉంటాయి. ఈ రకంగా ఈ కథలు పిల్లల్ని తమ అంతరంగంలోకి వెళ్ళేలా చేసి తాము ఎవరి పక్షాన ఉన్నారో తేల్చుకోమంటాయి. తమ కథా శిల్పంతో పిల్లల్ని మంత్రముగ్థుల్ని చేస్తాయి. అందుకే ఈ కథలకు ఇంకా వన్నె తగ్గని ఆకర్షణ.

 అనగా అనగా కథలు పేరుతో మంచి పుస్తకం ప్రచురించిన పుస్తకంలో వివిధ దేశాలకు చెందిన 14 జానపద కథలు ఉన్నాయి. ఇవి నార్వే, ఇటలీ, న్యూజీలాండ్, ఛెక్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, స్పెయిన్, జావా, భారతదేశం, జపాన్, ఇంగ్లాండ్ దేశాలకు చెందిన కథలు. ఈ జానపద కథల గొప్పతనం ఏమిటంటే ఏ దేశపు పిల్లలు చదువుకుంటే అవి ఆ దేశపు కథలుగానె అనిపిస్తాయి. ఈ కథలు మన కథలు అనిపించటానికి కారణం అబ్బూరి ఛాయాదేవి. ఇక్కడి పేర్లు పెట్టి పిల్లలకు అర్థమయ్యేలా ఛాయాదేవిగారు తెనిగించారు. 1955 ప్రాంతంలో మొదటిసారి ముద్రితమై ఇప్పటి (ఆధునిక, కంప్యూటర్) యుగం పిల్లల్ని కూడా అవి ఆకర్షించాయంటే మూల కథల బలమూ, ఛాయాదేవిగారి శైలి జమిలిగా పనిచేసాయనటంలో సందేహం లేదు. కథలకూ, ముఖచిత్రానికి కొచ్చెర్ల వి. ఆర్. వేసిన బొమ్మలు చక్కగా అమిరాయి.

సస్యసుందరి అన్న కథలో దద్దమ్మ అనుకున్న రాకుమారుడే అందరిలోకి అందమైన భార్యని తెచ్చుకున్నాడు. మొదట చెంచాలో పట్టేంత చిన్నగా ఉన్న ఆమె జయశేఖరుని ప్రేమకు పూర్ణరూపం సంతరించుకుంటుంది. అలాగే శ్వేత భల్లూకం అన్న కథలో ఎలుగుబంటి రూపంలో ఉన్న రాకుమారుడినీ, మూషిక రంధ్రం కథలో కప్ప రూపంలొ ఉన్న ప్రియురాలిని ఆ కథల్లోని నాయికా, నాయకులు తమ సహనం, శక్తి యుక్తులతో అందుకోగలుగుతారు. యక్షప్రశ్నలకు బదులిచ్చి తన తమ్ముళ్ళను సాధించుకున్న ధర్మరాజు మాదిరి బుధ్ధిబలం అన్న కథలో రాక్షసుడి ప్రశ్నలకు బదులిచ్చి తన అన్ననే కాకుండా రాకుమారిని భార్యగా పొందుతాడు.

పందెంలో గెలిచినా బీద గొర్రెలకాపరికి తన కూతుర్ని ఇచ్చి పెళ్ళి చెయ్యకూడదనుకున్న కోయరాజు భంగపడిన విధానం పోయిన బల్లెంలో కనపడితే, స్వర్ణపేటిక అన్న కథలో రాజగురువు తన శిష్యురాలైన రాకుమారిని మోహించి, ఆమెను పొందుదామని కుట్రపన్నుతాడు. కాని, విఫలమౌతాడు. అలాగే వీరన్న శౌర్యంలో సవతి తల్లి ద్వేషం గాని, నావికుడి మోసంగాని వీరన్నని తన గమ్యంనుంచి దూరం చెయ్యలేకపోయాయి.

దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడని అంటారు. కాని, ఆ పూజారి పాత్ర మనలోని దురాశ పోషిస్తే ఏమవుతుందో మూడు కోరికలు చదివితే తెలుస్తుంది. సముద్రపు నీరు ఉప్పగా ఎందుకు ఉంది? ఒకప్పటి ప్రజలు తమ ఊహాశక్తి ఆధారంగా అల్లుకున్న కథే అసలు రహస్యం. ఇలా చెప్పుకుంటూ వెళితే ఒక్కొక్క కథ ఒక్కొక్క ఆణిముత్యం అవుతుంది. వాటి పరిచయాలు చాలించి అబ్బూరి ఛాయాదేవి శైలిలోని అసలు కథల్లోకి వెళ్ళండి.

 పేజీలు: 104; వెల: 40 రూపాయలు

ప్రతులకు: మంచి పుస్తకం

Monday, January 12, 2009

పిల్లలకు పుస్తకాలను అలవాటు చెయ్యండి. . .

 పుస్తకాలను మించి  స్నేహితులు ఉండరని అంటారు. అట్లాంటి  స్నేహం పిల్లలకు చిన్నప్పటినుంచి ఏర్పడితే! అంతకంటే కావలసింది ఏముంది?

నేర్చుకోవడం అన్నది  పిల్లల సహజ గుణం. మరీ చిన్నప్పుడు వాళ్ళు ప్రతిదీ నోటి ద్వారా తెలుసుకోవాలని అనుకుంటుంటారు. ఒక దశలో వాళ్ళ చేతికి దినపత్రిక దొరికితే చాలు ఆడుతూ  చించి పెడతారు. పుస్తకాల పేజీలు తమంతట తాము తిప్పటానికి ప్రయత్నిస్తారు. చిన్న పిల్లలకి ఒక పుస్తకం కొనిస్తే వాళ్ళకి చదవటం రాకపోయినా, కనీసం పేజీలు తిప్పటం రాకపోయినా దానిని తమకు ఇవ్వమని  మారాం చేస్తారు. తమ గుండెలకు హత్తుకునిఇది నాదిఅంటారు. ఈ చిన్ని ఆనందాలను పిల్లలు పొందేలా పెద్దలు  అనుమతించాలి.

తమకు, తమ పిల్లలకు తినుబండారాలు కొనడానికి చాలామంది  లెక్కచెయ్యకుండా ఎంతో ఖర్చు చేసేస్తుంటారు. కానీ పుస్తకాలు కొనడానికి వచ్చేసరికి ఖర్చు చేయడానికి ఎంతో తటపటాయిస్తుంటారు. ఒకవేళ  పుస్తకం కొంటే అది నలగకూడదని, పాడైపోకూడదని  ఇదైపోతుంటారు. దీని వల్ల పిల్లలు  పుస్తకాలను ఆస్వాదించలేని, ఆనందించలేని  పరిస్థితి ఏర్పడవచ్చు.

పుస్తకాన్ని జాగ్రత్తగా చూసుకోవటం మంచిదే. పేజీలు తిప్పేటప్పుడు నలగకుండా  చూడటం, చదువుతున్న పేజీకి గుర్తుగాబుక్‍మార్క్పెట్టుకోవటం వంటి వాటి వల్ల చదివినా  పుస్తకం నలగకుండా ఉంటుంది. పుస్తకానికి  అట్ట వేస్తే కూడా ఎక్కువ కాలం మన్నుతుంది. అయితే ఇవన్నీ ఒక వయస్సు వచ్చిన తరువాత చెయ్యవలసిన పనులు.

చిన్న పిల్లల విషయంలో  మాత్రం పుస్తకం చిరగటం మంచిదే అన్న సూత్రాన్ని పాటించాలి. అంతగా అయితే పాత చందమామ, వార పత్రిక, ఆదివారం మ్యాగజైన్ వంటి పుస్తకాలను ఇచ్చి పిల్లలు వాటి పేజీలు తిప్పటం, తిరగెయ్యటం నేర్చుకునేలా చెయ్యాలి.

జన విజ్ఞాన వేదిక,  మంచి పుస్తకం, చిల్డ్రన్స్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన ఎన్నో పుస్తకాలు 6 – 20 రూపాయల మధ్య ఉన్నాయి. పిల్లలకు పుస్తకాలను పరిచయం చెయ్యటానికి ఇవి ఎంతైనా అనువుగా  ఉంటాయి.

(పుస్తకాలతో స్నేహం  బులెటిన్ 1, డిసెంబరు 2008 నుండి.)

Friday, January 9, 2009

’మంచి పుస్తకం’ బుక్ ట్రస్ట్

పిల్లల పుస్తక ప్రపంచం - మంచి పుస్తకం

చక్కని పుస్తకాలను తెలుగులో పిల్లలకు చేరువలోకి తీసుకురావటం కోసం మంచి పుస్తకంబుక్ ట్రస్ట్ గత ఎనిమిది సంవత్సరాలుగా క్రుషి చేస్తూ ఉంది. దీని వెనుక అనేక మంది మిత్రుల సహాయ సహకారాలు వెన్నుదన్నుగా ఉన్నాయి. హైదరాబాదు బుక్ ఫెయిర్లో ఆరు సంవత్సరాలుగా మొదలయిన పయనం ఇప్పుడు అనేక పుంతలు తొక్కుతోంది. సరదాగా పుస్తకాల అమ్మకం’, ’చదవడానికి ఓ మంచి పుస్తకంతోపాటు పిల్లల పుస్తకాల జాబితా ప్రచురించి పుస్తక ప్రోత్సాహానికి మంచి పుస్తకంనడుం కట్టింది.  ఈ కాలంలో తెలుగులో పిల్లల పుస్తకల ప్రచురణలో గణనీయమైన ప్రగతిని చూశాం. ఈ ప్రయత్నంలో మంచి పుస్తకం తన వంతు పాత్ర వహించడం మాకు ఆనందంగా ఉంది.

చిన్నపిల్లలకు వారి మాత్రుభాషా వాతావరణం కల్పించాల్సిన ప్రాముఖ్యాన్ని ప్రపంచంలోని ప్రముఖులైన పిల్లల మనస్తత్వ శాస్త్రవేత్తలందరూ నొక్కి చెబుతున్నారు. పిల్లలతో చిన్నప్పటినుండి తెలుగులో మాట్లాడటంతో పాటు వారికి ఆయా పుస్తకాలు అందుబాటులో ఉంచాలి. పుస్తకాల ద్వారా వారి సృజనాత్మక ప్రపంచానికి తలుపులు తెరిచిన వాళ్ళం అవుతాం. వారిలో ఆత్మ విశ్వాసాన్ని, పఠనాసక్తిని పెంపొందించిన వాళ్ళం అవుతాం. ఈ ఉద్దేశంతోనే మంచి పుస్తకం పనిచేస్తోంది.

పిల్లల పుస్తకాలు, బొమ్మల పుస్తకాలు, కధలు, తెలుగు-ఇంగ్లీషు భాషలలో రంగుల బొమ్మల పుస్తకాలు, సైన్సు పుస్తకాలు మంచి పుస్తకంలో ఉంటాయి. ఇందులో భాగంగా మంచి పుస్తకం బుక్ ట్రస్ట్, జన విజ్ఞాన వేదిక, చిల్డ్రన్స్ బుక్ ట్రస్ట్, నేషనల్ బుక్ ట్రస్ట్, హైదరాబాదు బుక్ ట్రస్ట్, పీకాక్ క్లాసిక్స్ వంటి ప్రచురణకర్తల నుండి ఎంపిక చేసిన పుస్తకాలు కూడా ఈ ప్రదర్శనలో ఉంటాయి. ఈ స్టాల్లో పిల్లల పుస్తకాలే కాకుండా, పిల్లల పెంపకం గురించి, విద్యా బోధన గురించి తల్లిదండ్రులకూ, టీచర్లకూ ఉపయోగపడే పుస్తకాలు ఉంటాయి.ఈ సంవత్సరం బొకేలు వద్దు బుక్కులు ఇవ్వండిఅన్న థీమ్ తో పుస్తక ప్రదర్శనను నిర్వహిస్తోంది. కొత్త సంవత్సరానికి, పుట్టినరోజులకి బహుమతులుగా పుస్తకాలు ఇవ్వటాన్ని మంచి పుస్తకం ప్రోత్సహిస్తోంది. ఎవరికైనా అభినందనలు, శుభాకాంక్షలు తెలియచెయ్యటానికి పుస్తకాలను మించినవి ఉండవు. పాఠశాలల్లో వార్షిక బహుమతులగా కూడా పుస్తకాలు చిరకాలం జ్ఞాపకాలుగా ఉంటాయి. పుస్తకాలు చదవటాన్ని ఆనందదాయకమైన వ్యాపకంగా పిల్లలకు చేద్దాం.

మంచి పుస్తకం

12-13-450, వీధి నెం 1, తార్నాకా, సికింద్రాబాదు 500 017

ఫోను: 094407 46614; www.manchipustakam.in; email: info@manchipustakam.in